క్రికెట్ ఆటగాళ్లను రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22న ప్రారంభమవుతోంది. మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతాయి. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ లీగ్ పోటీలను నిర్వహిస్తోంది. అధిక మొత్తంలో ఫీజు ముట్టడం వల్ల వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడేందుకు ఎంతో ఉత్సాహం చూపుతారు.
ఐపీఎల్ మొదట 2008లో ప్రారంభమైంది. 2008 నుంచి 2022 దాకా జరిగిన పోటీలలో ఎనిమిది జట్లు మాత్రమే ఆడేవి. 2023 నుంచి కొత్తగా రెండు జట్లు చేరాయి. మొదటి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలుచుకుంది. ఆ జట్టుకు అప్పుడు షేన్ వార్న్ సారథ్యం వహించారు.
ఇప్పటివరకు అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్లలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరొక ఐదు టైటిళ్లు గెలిచాయి. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మూడుసార్లు గెలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్) ఒక్కో టైటిల్ గెలుచుకున్నాయి.
అయితే, ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ట్రోఫీ గెలవలేదు. టోర్నీ ప్రారంభ సీజన్ నుంచి ఉన్న ఆర్ సి బి జట్టు ప్రతిసారి భారీ అంచనాలతో దిగినప్పటికినీ విజయలక్ష్మి మాత్రం వరించడం లేదు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జట్టు ఈసారైనా కప్పును ఎగరేసుకుపోతుందా?